మరీ ఇంత మోసమా! స్నేహితుడే కదా అని నమ్మి ఇంట్లోకి రమ్మంటే..

24 Nov, 2021 15:52 IST|Sakshi

బంజారాహిల్స్‌: స్నేహితుడని నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడో నమ్మకద్రోహి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ సమీపంలోని రహమ్మత్‌నగర్‌లో నివాసం ఉండే పోతాల కుమార్‌కు తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు తిప్పన షాలేమ్‌రాజ్‌ ఈ నెల రెండో వారంలో ఫోన్‌ చేసి తాను వారం రోజుల్లో గది అద్దెకు తీసుకుంటానని... అప్పటి వరకు ఇంట్లో ఉంటానంటూ కోరాడు.
(చదవండి: రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది?)

ఇందుకు కుమార్‌ అంగీకరించి షాలేమ్‌రాజ్‌తో పాటు తన భార్యను తన గదిలో ఉంచుకున్నాడు. ఈ నెల 14వ తేదీన కుమార్‌ కూకట్‌పల్లికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉండాల్సిన రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు బైక్‌ చోరీకి గురయ్యాయి. స్నేహితుడు షాలేమ్‌రాజ్‌తో పాటు ఆయన భార్య ఇంట్లో నుంచి ఉడాయించారు. కొద్దిసేపట్లోనే ఆయనకు బ్యాంక్‌ నుంచి రూ. 1.70 లక్షలు డ్రా అయినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా తన అకౌంట్‌ నుంచి షాలేమ్‌రాజ్‌ బ్యాంక్‌ అకౌంట్‌లోకి ఈ డబ్బు బదిలీ అయినట్లుగా తెలిపారు.

తన మొబైల్‌ నంబర్‌కు బ్యాంక్‌ అకౌంట్‌ అనుసంధానంగా ఉందని మొబైల్‌ ఫోన్‌లోంచి సిమ్‌ కార్డు దొంగిలించి షాలేమ్‌రాజ్‌ ఈ డబ్బులు బదిలీ చేయించుకున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు షాలేమ్‌రాజ్‌పై ఐపీసీ సెక్షన్‌ 380 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
(చదవండి: వాక్‌వేలో కుక్క పిల్లలను చంపిన బాలుడు)

మరిన్ని వార్తలు