ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌

27 Aug, 2021 07:54 IST|Sakshi

సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్‌): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్‌ ప్రేమ్‌నగర్‌లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడే వస్తానంటూ భర్త ప్రేమ్‌ సాయికుమార్‌కు చెప్పి వెళ్ళి అరగంటైనా తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. బంధుమిత్రుల ఇళ్ళల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చేస్తున్నారు.   

జైలుకు వెళ్లొచ్చినా మారలేదు 
హిమాయత్‌నగర్‌: యువతి వెంటపడుతూ వేధిస్తున్న యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. కింగ్‌కోఠి షేర్‌గేట్‌లో నివాసం ఉండే యాంకరింగ్‌ చేస్తున్న యువతి అదే ప్రాంతంలో నివాసం ఉండే సల్మాన్‌ఖాన్‌లు ప్రేమించుకున్నారు. గత ఏడాది ఇద్దరి మధ్య వాగ్వివాదాలు రావడంతో..యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తరువాత కొద్దిరోజులుగా యువతి ఇంటి వద్దకు వచ్చి నిలబడటం, యువతిని వెంబడించడం, ఫోన్‌ మాట్లాడుతూ యువతిని తిట్టడం లాంటివి చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడకపోయినా  ఫాలో అవుతున్న తీరును చూసిన యువతి తల్లి బుధవారం యువతితో కలసి మరోమారు కేసు పెట్టింది. దీంతో గురువారం సల్మాన్‌ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు.  

చదవండి: భర్త ఇంట్లో ఉండగా.. తాళం వేసి బయటి వెళ్లి..

మరిన్ని వార్తలు