అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి..

2 Jun, 2022 14:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన మూగ, చెవిటి బాలికను నాలుగు నెలల పాటు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితోపాటు సహకరించిన మహిళను బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే బాలిక(16) గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన అదృశ్యమైంది. ఆ మేరకు తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బాలిక ఆచూకీ లభించగా ఆమెను పునరావాస కేంద్రంలో చేర్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా తనను గాజుల రామారం సమీపంలోని దేవేంద్రనగరంలో కోళ్ల రజిని అనే మహిళ చేరదీసి ఇంట్లో పనిమనిషిగా చేర్చుకుందని ఆ పక్కనే నివసిస్తున్న సజ్జపురపు యాదిరెడ్డి(19) తనపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. రోజూ గంజాయి తాగి వచ్చి తనను కొడుతూ సిగరెట్‌ పీకలతో కాలుస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ కోరికలు తీర్చుకునేవాడంది. బయట పడేందుకు యత్నిస్తుంటే రజిని అడ్డుకునేదని గదిలో బంధించేదని ఆరోపించింది. దీంతో పోలీసులు రజినితోపాటు యాదిరెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 363 కింద కేసు నమోదు చేశారు.
చదవండి: సచిన్‌.. నాకు బతకాలని లేదు: కృతి సంభ్యాల్‌

మరిన్ని వార్తలు