వామ్మో.. బస్సు కుదుపు ఎంత పనిచేసింది!

19 Apr, 2021 14:20 IST|Sakshi

సాక్షి, సుల్తాన్‌బజార్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్‌ఆర్‌నగర్‌ హాస్టల్‌లో ఉంటున్న పవన్‌చైతన్య (23) బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన బస్సులో (రూట్‌ 218 బి) పటాన్‌చెరువు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్తున్నాడు.

 కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తాలో బస్సు కుదుపుకు రాక్‌సైడ్‌ విండోవద్ద కూర్చున్న పవన్‌చైతన్య ఒక్కసారిగా ఎగిరి పడటంతో తలకు, కుడిపక్క తీవ్ర గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావమైన పవన్‌చైతన్య ఒక్కసారిగా కుప్పకూలాడు.  విషయం తెలుసుకున్న తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పవన్‌ చైతన్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవన్‌చైతన్య మృతిచెందారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రయాణికుడు మృతిచెందాడనే అనుమానంతో డ్రైవర్‌ గంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు