Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్‌

9 Oct, 2021 16:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఐటీ శాఖ ఫార్మా సంస్థలో సోదాలపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు సోదాల్లో 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
(చదవండి: బజ్జీల బండి.. కోట్ల ఆస్తులండీ!)

కంపెనీకి సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సదరు ఫార్మా కంపెనీ యూరప్‌, అమెరికాకు డ్రగ్స్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. 
(చదవండి: కరెన్సీ కట్టలు: రోడ్డుపై రూ.కోటి.. రూ.264 కోట్లు స్వాధీనం )

డిజిటల్ మీడియా, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్ల రూపంలో నేరపూరితమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ వెల్లడించింది. బోగస్, ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లలో వ్యత్యాసాలు వంటి విషయాలు బయటపడినట్లు తెలిపింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువగా కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఇతర అనేక విషయాలు బయటపడినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 

చదవండి: తీసుకుంది రూ​.117 కోట్లు.. చూపించింది రూ. 21 కోట్లు

మరిన్ని వార్తలు