‘ఇన్‌స్టంట్‌’ మోసగాళ్ల ఆటకట్టు

26 Dec, 2020 10:55 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

నలుగురి అరెస్ట్‌

నిందితుల్లో ఒకరు చైనీయుడు 

బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2 కోట్లు సీజ్‌ 

రెండు ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ ఫోన్లు స్వాధీనం 

సైబరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనార్‌ వెల్లడి 

గచ్చిబౌలి: ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌తో ఘరానా మోసానికి పాల్పడిన అంతర్జాతీయ ముఠాను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు. చైనాకు చెందిన జియా జాంగ్, ఢిల్లీకి చెందిన ఉమాపతి అలియాస్‌ అజయ్‌లు 13 ఇన్‌స్టంట్‌ యాప్‌లను డెవలప్‌ చేశారు. 2019లో ఇద్దరు కలిసి ఢిల్లీలో స్కైలైన్‌ ఇన్నోవేషన్‌ టెక్నాలజీస్‌ ఇండియా పైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా గూర్గావ్‌లో టాప్‌ఫన్‌ టెక్నాలజీస్, ఫాస్‌మటే టెక్నాలజీస్, 9 నెలల క్రితం హైదరాబాద్‌లో కుబేవో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బెస్ట్‌ షైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కంపెనీలను నెలకొల్పారు. షాంగైకి చెందిన ఇ బాయ్‌ అలియాస్‌ డిన్నీస్‌ చెందిన జికాయ్‌ హోల్డింగ్‌ పీటీఈలో సీఓఓగా పని చేస్తూ బిజినెస్‌ వీసాపై ఇండియాకు వచ్చాడు.

కొత్త ప్రాంతంలో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసే అతడికి రాజస్తాన్‌కు చెందిన సత్యపాల్‌ ఖైలియా సహకరించేవాడు. మహరాష్ట్రకు చెందిన అనిరుధ్‌ బెస్ట్‌ షైన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రిలేషన్స్‌ మేనేజర్‌గా పని చేస్తుండగా, మురతోటి రిచి హెమంత్‌ సేత్‌ స్కై లైన్‌ కంపెనీ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు.  ఇన్‌స్టంట్‌ లోన్‌ తీర్చినా బకాయి ఉందని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఓ వ్యక్తి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిల్లీ కేంద్రంగా స్కైలైన్‌ ఇన్నోవేషన్స్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ జియా జాంగ్‌ నేతృత్వంలో రుణాలు ఇచ్చి 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కుబేవా టెక్నాలజీస్‌ పై దాడులు నిర్వహించి రెండు ల్యాప్‌ టాప్‌లు, నాలుగు సెల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ.2 కోట్ల నగదును ఫ్రీజ్‌ చేశారు. చైనాకు చెందిన బాయ్‌ అలియాస్‌ డిన్నీస్, సత్యపాల్‌ ఖైలియా , అనిరుధ్, మురతోటి రిచి హెమంత్‌ సేత్‌ లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితులు జియా జాంగ్, ఉమాపతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా జియా జాంగ్‌ సింగపూర్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. నిందితులపై సైబరాబాద్‌ పరిధిలో 8, హైదరాబాద్‌ పరిధిలో 13, రాచకొండ పరిధిలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. 

ఫిబ్రవరిలో దేశం దాటిన క్యూ యోన్‌
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌ యాప్స్‌ వ్యవహారాల్లో చైనీయులే కీలకమని స్పష్టం కావడంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరోపక్క ఈ లోన్‌ యాప్స్‌ వేధింపుల ఇప్పటి వరకు సిటీలో నమోదైన కేసుల సంఖ్య 27కు చేరింది. గురువారం రాత్రి బెంగళూరులోని కాల్‌ సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు.

ఈ యాప్స్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన చైనాకు చెందిన క్యూ యోన్‌ అనే మహిళ దాదాపు ఏడాదిన్నర పాటు భారత్‌లో ఉండి యాప్‌లతో పాటు కాల్‌సెంటర్ల  ఏర్పాటు వ్యవహారాలను పర్యవేక్షించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె చైనా తిరిగి వెళ్లినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయాలని భావిస్తున్నారు. 

చైనీయులు కేవలం నిబంధనల నేపథ్యంలోనే తమ సంస్థల్లో భారతీయుల్ని డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా క్యూ యోన్‌ ఢిల్లీలో నియమించిన వ్యక్తే ల్యాంబో. ఇటీవల లోన్‌ బాధితుల ఆత్మహత్యలు, కేసు లు నమోదు తదితర పరిణామాల నేపథ్యంలో ల్యాంబో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతడి కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  

హైదరాబాద్‌ కాల్‌ సెంటర్లకు కీలకంగా వ్యవహరించి మధుబాబు స్నేహితుడు నాగరాజ్‌తో బెంగళూరులో రెండు కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయించాడు. ఎన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్, ట్రూత్‌ ఐ పేర్లతో ఉన్న వీటికి తన సమీప బంధువైన ఈశ్వర్‌ను హెడ్‌గా నియమించాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వీటిపై దాడి చేసి ఈశ్వర్‌తో పాటు మధుసూదన్, సతీష్‌కుమార్‌లను అరెస్టు చేసి సిటీకి తీసుకువస్తున్నారు. 

యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి 
ఇన్‌స్టంట్‌ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్‌ సూచించారు. అలాంటి యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేయవద్దని, ఆర్‌బీఐ గుర్తించిన సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అనుమతి ఇచి్చన ఫైనాన్స్‌ సంస్థల నుంచి లేదా తెలిసిన వారి వద్ద రుణాలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరిట ఎవరైనా వేధి స్తే సమీపంలోని పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశ ంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బాలకృష్ణా రెడ్డి, సీఐలు సంజయ్‌ కుమార్, శ్రీనివాస్, ఎస్‌ఐలు విజయవర్ధన్,రాజేందర్, మురళి పాల్గొన్నారు. 

116 యాప్స్‌ తొలగించాలని లేఖ 
గూగుల్‌ అప్‌లోడ్‌ చేసిన యాప్స్‌తో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఈ క్రమంలో 116 యాప్స్‌ను తొలగించాలని గుగూల్‌కు లేక రాసినట్లు సీపీ తెలిపారు. ఇద్దరు చైనీయుల వీసాలపై దర్యాప్తు చేస్తున్నామని, వారి నేర చరిత్రను తెలుసుకునేందుకు  ఇంటర్‌ పోల్‌ సహాయం తీసుకుంటామన్నా రు. యాప్స్‌ ద్వారా లోన్‌ ఇచ్చే నగదు ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు. కాల్‌ సెంటర్లలో పని చేసే వారిని విచారిస్తున్నామని, తెలిసి మోసాలకు పాల్పడిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. యాప్స్‌ ద్వారా 7 రోజులు, 15 రోజులకు లోన్లు ఇస్తున్నారని, బకెట్‌ లిస్ట్‌ ఎం2, ఎం3 కేటగిరీపై ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో తెలియాల్సి ఉందన్నారు. 40 ఏళ్ల లోపు వారిని టార్గెట్‌ చేసి రుణాలు ఇచ్చి 25 నుంచి 30 శా తం వడ్డీ వసూలు చేస్తున్నారని తెలిపారు. సమాయానికి లోన్‌ కట్టని వారిని అసభ్య పదజాలంతో తిడుతూ, లీగల్‌ నోటీసులు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ఇప్పటికే లోన్‌ యాప్స్‌ మోసాలపై ఆర్‌బీఐ అధికారులకు తెలిపామని, కేంద్ర ఏజెన్సీలకు లేక రాస్తామన్నారు.  

మరిన్ని వార్తలు