సకుటుంబ సపరివార సమేతంగా..

16 Feb, 2021 12:02 IST|Sakshi

దొంగలుగా మారిన కుటుంబీకులు, బంధువులు 

బంగారం దుకాణాలే టార్గెట్‌గా వరుస నేరాలు

ఆరుగురిని అరెస్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌  

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): ఓ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓ సభ్యుడికి చెందిన ఆటోలో తిరుగుతూ బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కస్టమర్లుగా నటిస్తూ వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం, వెండి ఆభరణాలు తస్కరిస్తున్నారు. నెల రోజుల్లో మూడు నేరాలు చేసిన ఈ ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు సోమవారం తెలిపారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వై.రేణుక, ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు.
హయత్‌నగర్‌ ప్రాంతంలో స్థిరపడిన వీరు తొలినాళ్లల్లో చిన్నచిన్న పనులు చేసినా... ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేణుక నేతృత్వంలో వీరు ముఠా కట్టారు. 
ఈ ఐదుగురూ కిరణ్‌కు చెందిన ఆటోలో నగరంలో తిరుగుతూ దారిలో కనిపించిన జ్యువెలరీ దుకాణాల్లో తమకు అనువుగా ఉన్న దాన్ని ఎంచుకుంటారు. 
వినియోగదారుల మాదిరిగా అందులోకి ప్రవేశిస్తారు. ఒకరు నగలు, వస్తువులు చూపించాల్సిందిగా యజమానికి చెప్తారు. ఆయన ఆ పనిలో ఉండగా మిగిలిన వారు అతడి దృష్టి మళ్లించి చేతికి చిక్కిన బంగారు, వెండి వస్తువులు తస్కరిస్తారు. 
వీటిని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆపై అంతా కలిసి తమ ఆటోలోనే ఉడాయిస్తారు. చోరీ సొత్తును విక్రయించి వచి్చన సొమ్ము పంచుకునేవారు. 
ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్‌స్వరూప్‌ జ్యువెలర్స్‌ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్‌ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని త్రిషాల్‌ జ్యువెలర్స్‌ నుంచి 400 గ్రాముల వెండి తస్కరించారు. 
తుకారాంగేట్‌ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది. 
సోమవారం ఆరుగురినీ పట్టుకుని వీరి నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకుంది. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  నిందితుల్ని తుకారాంగేట్‌ పోలీసులకు అప్పగించింది. 
ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గంజదొంగ   
బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్

మరిన్ని వార్తలు