ఒంటరిగా వున్న ఇద్దరు వృద్ధ మహిళల గొంతు కోసి..

21 Aug, 2021 08:22 IST|Sakshi

సాక్షి, చిక్కడపల్లి( హైదరాబాద్): ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలపై మిట్ట మధ్యాహ్నం చాకుతో దాడి చేసి గాయపరిచి దోపిడీకి యత్నించి పరారవుతున్న ఓ ఆగంతకుడిని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్, స్థానికులు పట్టుకుని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన ఇద్దరు మహిళలు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

సీఐ పాలడుగు శివశంకర్‌రావు, ఎస్‌ఐ.ప్రేమ్‌ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపట్టి వారిపాలెం గ్రామానికి చెందిన బీటెక్‌ చదవి నిరుద్యోగిగా ఉన్న కోట నరేంద్ర (27) హైదరాబాద్‌లోని యుసుఫ్‌గూడలోని రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జనసమ్మర్థం తక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుని దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా దోమలగూడ ప్రాంతాన్ని తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈనెల 18న దోమలగూడలోని సుభాగ్య అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులో హైకోర్టులో పనిచేసి రిటైర్‌ అయిన సీతా భాగ్యలక్ష్మి (61) ఉంటున్నది.

వద్దకు కేన్సర్‌తో బాధపడుతున్న  ఆమె చెల్లెలు జోత్స్నరాణి (66) ఇంటికి ఇటీవల వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక వ్యక్తి సీతాభాగ్యలక్ష్మి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి కత్తితో ప్రవేంశించాడు. వారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారు  అరవడంతో ఇంటి లోపలి నుంచి వచ్చిన చెల్లెలు సీతపై కూడా కత్తితో గొంతుపై ఇతర భాగాలపై దాడి చేశాడు. వెంటనే తేరుకున్న వారు పెద్దగా అరవడంతో దాడి చేసిన వ్యక్తి అపార్ట్‌మెంట్‌ మెట్ల మార్గం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.  విషయాన్ని 100 సిబ్బంది ద్వారా చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  చిక్కడపల్లి  పోలీసులు నిందితుడిపై 313, 393, 452, సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు