ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి ఆకతాయిలు.. అశ్లీల ఫోటోలు పోస్టు చేస్తూ..

8 Apr, 2021 07:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి ఆకతాయిలు జొరబడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోయాయి. తాజాగా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు. ఆమె తన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఇంగ్లీషు పాఠం చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ క్లాసులోకి ప్రవేశిస్తున్నారు.

అసభ్య, అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఆన్‌లైన్‌ క్లాసులో ఉన్న విద్యార్థుల్లో ఎవరో ఒకరి ఈ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సదరు ఆకతాయిలకు తెలిసి ఉంటాయని, అందులో ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి జొరబడగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు.  

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ప్రశాంత్‌ కుమార్‌.. 
సోషల్‌ మీడియా యాప్‌ టాంటన్‌లో నగర యువతికి పరిచయమై ఆపై అదును చూసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగిన బీదర్‌ యువకుడు ప్రశాంత్‌ కుమార్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: అమెజాన్‌లో హార్డ్‌ డిస్క్‌ ఆర్డర్‌.. పార్సిల్‌ విప్పగానే షాక్‌!‌

మరిన్ని వార్తలు