‘బావ మారలేదు.. ఆమెతో మళ్లీ చాట్‌ చేస్తున్నాడు’

19 Jan, 2021 12:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య

సాక్షి, రామచంద్రాపురం(పటాన్‌చెరు): మరో అమ్మాయితో భర్త రహస్యంగా వాట్సప్‌ చాటింగ్‌ చేస్తున్నాడనే మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన రామలక్ష్మి(25) మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డితో వివాహం జరిగింది. జీవనోపాధికై రామచంద్రపురం వలస వచ్చారు. వెంకట్‌ రెడ్డి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నం కింద ఎకరం భూమి, 50 గ్రాముల బంగారం, నగదును ఇచ్చారు. వివాహం జరిగిన సమయంలో ఇద్దరు మంచిగానే కాపురం చేశారు. వారికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. మృతురాలి భర్త వెంకట్‌ రెడ్డి ఆయన పని చేసే కంపెనీలో ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరుచుకున్నాడు. రహస్యంగా వాట్సాప్‌ లో ఆమెతో చాటింగ్‌ చేసేవాడు. ఈ విషయంలో గతంలో మృతురాలు రామలక్ష్మి భర్త వెంకట్‌ రెడ్డిని నిలదీసింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. చదవండి: విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే

ఈ విషయంలో కూతురు సంసారం పాడవుతుందన్న ఆలోచనతో అల్లుడికి నచ్చజెప్పారు. ఆ సమయంలో తను చాటింగ్‌ చేయనని హామీ ఇచ్చాడు. కాగా మృతురాలు రామలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చింది. ఆ సమయంలో భర్త తిరిగి అమ్మాయితో చాటింగ్‌ చేసిన మెసేజ్‌ను చూసి ఆ మెసేజ్‌లను తన చెల్లికి పంపించింది. తన చెల్లికి ఫోన్‌ చేసి బావ మారలేదని, తిరిగి ఆ అమ్మాయితో చాటింగ్‌ చేస్తున్నాడని ఆ బాధ భరించలేక చనిపోతున్నా అని ఫోన్‌ పెట్టేసింది. తిరిగి చెల్లెలు ఫోన్‌  చేసినా తీయకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. కాగా సోమవారం తెల్లవారుజామున అల్లుడు వెంకట్‌ రెడ్డి తమకు ఫోన్‌ చేసి తమ కూతురు రామలక్ష్మి పడక గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారని తెలిపారు. తమ అల్లుడు మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి తన కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని అల్లుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్‌‌ వర్థంతి కార్యక్రమంలో విషాదం

ఒంటికి నిప్పంటించుకొని..
సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణంలోని దత్తత్రేయనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివపేట పట్టణంలోని దత్తాత్రేయనగర్‌ కాలనీకి చెందిన గాండ్ల శ్రీలత (35)కు కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీలత కంది మండలం ఎర్థనూర్, మామిడిపల్లి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించింది. ఆదివారం రాత్రి పుట్టింటికి వచ్చిన ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సోమవారం సదాశివపేట పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు