క్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. తీర్చడానికి తిప్పలు..

18 Aug, 2021 08:28 IST|Sakshi

అప్పులు తీర్చేందుకు చోరీ 

సాక్షి, బంజారాహిల్స్ ( హైదరాబద్): అప్పులు తీర్చేందుకు చోరీకి పాల్పడ్డ యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్‌ పట్టణానికి చెందిన జన్నా రమేష్‌ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్మికనగర్‌లో నివాసం ఉంటున్నాడు. టైల్స్‌ వర్క్‌ చేస్తున్న రమేష్‌ కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ టోర్నీ సందర్భంగా అప్పులు చేసి బెట్టింగ్‌లు కట్టాడు.

వాటిని తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో ఈ నెల 15న రెహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి ఆంజనేయులు ఇంట్లో చొరబడి అల్మారాలోంచి రూ.25,500 నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఆంజనేయులు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం జన్నా రమేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు