కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో...

27 Feb, 2021 12:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడిని పురమాయించి, ఘాతుకం

20 రోజుల కిందట ఘటనపోలీసుల విచారణతో వెలుగులోకి..

నిందితుల అరెస్టు

కరీంనగర్‌ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. 20 రోజుల కిందట ఇది జరగగా పోలీసు విచారణతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్ర కారం.. మానుపాటి రాజయ్య(35) కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తూ రేకుర్తిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజయ్య ఈ నెల 5న పని ముగించుకొని తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య లత ఠాణాలో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు 7న మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ 16న మహబూబాబాద్‌ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్‌ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతతో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. 

అతన్ని అడ్డు తొలగించాలని లత కోరడంతో బాబు ఈ నెల 5న రాజయ్యను కల్లు తాగుదామని తన స్వగ్రామం హుస్నాబాద్‌ మండలం మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువస్తున్నాడు. లత ఫోన్‌ చేసి, చంపేయాలని పట్టుబట్టింది. దీంతో బాబు ముంజంపల్లి కెనాల్‌ వద్దకు తీసుకువెళ్లి, రాజయ్యకు మళ్లీ కల్లు తాగించాడు. అతని మెడపై బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. తర్వాత కెనాల్‌లోకి నెట్టేసి, బాబు ఇంటికి వెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు లత, బాబు ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

చదవండి: 
ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది...
'మీ నాన్నలాగే నిన్ను కూడా చంపేస్తా'

మరిన్ని వార్తలు