ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏయూ నిపుణుల బృందం
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: అనకాపల్లి పట్టణ సమీపంలో జాతీయ రహదారిపైన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీమ్లు కూలిపోయిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలతోపాటు పలు వర్గాల నుంచి డిమాండ్లు రావడంతో పోలీసులు బుధవారం సుమోటోగా కేసు నమోదుచేశారు.
సైట్ ఇన్చార్జి ఈశ్వరరావు, జీఎం నాగేంద్రకుమార్, దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు ఆర్వీఎస్. మూర్తి, శ్రీనివాసరావులతో కూడిన బృందం బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. కాగా ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై మృతుడు సతీష్ కుమార్ బావమరిది శశి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని బుధవారం నేషనల్ హైవే అథారిటీ పీడీ శివకుమార్ సందర్శించారు.