విషాదం.. మజాక్‌ల చేసిన పనితో దోస్త్‌ ప్రాణం పోయింది

16 Jul, 2022 19:34 IST|Sakshi

గాంధీనగర్‌: కొన్ని పనులు నవ్వులాట కోసమే చేసినా.. అవి ఊహించని ఫలితాన్ని ఇస్తుంటాయి. స్నేహితుడితో సరదాగా వ్యవహరిద్దామనుకుంటే.. అది కాస్త బెడిసి కొట్టింది. ఒక ప్రాణం పోవడంతో పాటు మరో యువకుడిని జైలు పాలు చేసింది. 

సరదా ఆట పేరుతో ఎయిర్‌ కంప్రెషర్‌ను వెనుక భాగంలో(పెద్ద పేగు చివరిభాగము) పెట్టడంతో.. ఓ టీనేజర్‌ ప్రాణం పోయింది. గుజరాత్‌ మెహ్‌సనా జిల్లా కడీ తాలుకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు, అతని స్నేహితుడు.. ఇద్దరూ అలోక్‌ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్నారు. అది వుడ్‌వర్క్‌ కావడంతో.. పనయ్యాక ఎయిర్‌ కంప్రెషర్‌తో దుస్తుల్ని శుభ్రం చేసుకుంటారు. ఈ క్రమంలో.. భోజన సమయంలో కంప్రెషర్‌తో బాధితుడు, ఆ స్నేహితుడు సరదాగా ఆడుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఆ చర్య వికటించి బాధితుడు స్పృహ కోల్పోగా.. ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాడు స్నేహితుడు. కడీలోని ఓ ఆస్పత్రికి బాధితుడిని హుటాహుటిన తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుహరంలోకి అకస్మాత్తుగా గాలి రావడంతో అంతర్గత గాయాలతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. రెచ్చగొట్టడంతోనే తాను సరదాగా అలా చేయాల్సి వచ్చిందని నిందితుడు చెప్తున్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సరదాగా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు