ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌కు ఇంటి తాళాలు: బంగారం చోరీ

1 Feb, 2021 17:03 IST|Sakshi

ముంబై: స్నేహం ముగుసులో ఓ అమ్మాయిని నమ్మించాడో దొంగ. ఆమె గురించి అన్ని వివరాలు రాబట్టి, చివరకు ఆమె ఇంటికే కన్నం వేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని కొలాబా పాస్తా లైన్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. అతడి కూతురికి ఇన్‌స్టాగ్రామ్‌లో 19 ఏళ్ల షియాజాన్‌ అగ్వాన్‌తో పరిచయమేర్పడింది. అప్పుడప్పుడు వీళ్లు కలుసుకునేవారు కూడా. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా ఆమె ఇంటి తాళాలను అతడి దగ్గర మర్చిపోయింది. ఇంకేముందీ, దొంగ చేతికి తాళాలు దొరికితే ఊరుకుంటాడా? అమ్మాయి ఫ్యామిలీ అంతా కలిసి ఊరెళ్లినప్పుడు ఆ తాళం సాయంతో ఇంట్లో చొరబడ్డాడు. (చదవండి: అల్లరి వద్దు అన్నందుకు ప్రాణాలు తీశాడు)

డబ్బు, రూ.24 లక్షల విలువైన బంగారం, ఐఫోన్‌ ఎత్తుకెళ్లాడు. తీరా వాళ్లు జనవరి 27న తిరిగి ఇంటికొచ్చేసరికి డబ్బులు సహా విలువైనవేవీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఇంట్లోకి చొరబడేందుకు ఎక్కడా ఆయుధాలు వాడిన దాఖలాలు కూడా కనిపించలేదు. దీంతో ఇదెవరో కుటుంబానికి తెలిసివాళ్లు చేసిన పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో అతడి కూతురిని విచారించగా తొలుత భయంతో ఆమె వివరాలు చెప్పేందుకు నిరాకరించినప్పటికీ తర్వాత నోరు విప్పక తప్పలేదు. ఓ రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుడు షియాజాన్‌ దగ్గర తాళాలు విడిచిపెట్టినట్లు చెప్పింది. దీంతో పోలీసులు సులువుగా అతడిని పట్టుకుని కస్టడీకి తరలించారు. అతడి దగ్గర నుంచి లక్ష రూపాయలతో పాటు ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మత్తు ఇచ్చి పనిమనిషిపై అత్యాచారం.. ఆపై వీడియో)

మరిన్ని వార్తలు