అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం 

1 Feb, 2021 08:01 IST|Sakshi

చింతలపూడిలో చెప్పుల దండ వేసిన దుండగులు 

దళిత సంఘాల ఆందోళన 

చింతలపూడి(పశ్చిమగోదావరి): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. (చదవండి: అది టీడీపీ నేతల కుట్రే)

దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆందోళనలకు వైఎస్సార్‌సీపీతో సహా పలు రాజకీయపారీ్టల నేతలు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా పాత బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరారు. దళిత నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.(చదవండి: టీడీపీ ప్రలోభాలు

దోషులకు కఠిన శిక్ష తప్పదు: డీఎస్పీ 
జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చెప్పుల దండను తొలగించారు. దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి, సీసీ కెమెరాల ఆధారంగా దోషులను పట్టుకోవడానికి విచారణ జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు