ఇంటర్‌ ఫలితాలు: మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్‌ అయ్యానని మరొకరు..

28 Jun, 2022 18:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులతో పాస్ కావడంతో అవమానంగా భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ సమీపాన చింతలబస్తీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తెలంగాణ బోర్డు ఇంటర్‌ మార్కులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చింతలబస్తికి చెందిన విద్యార్థి గౌతం కుమార్ (18) (ఎంపీసీ) తన ఇంటర్‌ ఫలితాలను తెలుసుకున్నాడు.

అయితే అందులో తక్కువ మార్కులతో పాస్ కావడంతో అది అవమానంగా భావించిన గౌతం మనస్తాపం చెంది తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మొదటగా గౌతమ్‌ని స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గౌతం మృతి చెందడంతో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం సైఫాబాద్‌ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.


పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది.. 
ఖమ్మం: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థి బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలం జుజ్జులరావు పేట గ్రామానికి చెందిన సిరికొండ సాయి అనే విద్యార్థి కూసుమంచిలోని ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదివి పరీక్షలు రాశాడు. తెలంగాణలో వెలువడిన ఇంటర్ ఫలితాల్లో సాయి మూడు సబ్జెక్టులలో పెయిల్ అయ్యాడు.

దీంతో మనస్తాపం చెందిన సాయి గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి ఇంటి వద్ద కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సాయి తల్లితో పాటు, స్థానికులు చుట్టు పక్కల వెతుకుతుండగా బావి వద్ద సాయి చెప్పులు కనిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా బావిలో సాయి మృత దేహం కనిపించింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: నెలకావట్టే.. నేల చదునాయే! మేఘమా.. మరువకే!

మరిన్ని వార్తలు