‘పబ్జీ’కి బానిసై ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

11 Oct, 2020 03:46 IST|Sakshi

తిరుపతి క్రైం: పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి నగరం మంగళం బీటీఆర్‌ కాలనీలో నివాసముంటున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్‌ కుమారుడు తేజేష్‌ (19) ఇంటర్‌ చదువుతున్నాడు. తేజేష్‌ కొంత కాలంగా పబ్జీ గేమ్‌కు బానిసయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు నిరంతరం మందలిస్తున్నా పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో తేజేష్‌ పబ్జీ గేమ్‌ కోసం ఆన్‌లైన్‌లో ఖర్చు పెట్టుకునేందుకు తండ్రిని రూ.3 వేలు అడిగాడు. తండ్రి నిరాకరించడంతోపాటు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం రాత్రి తన బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం లేచి చూసేసరికి తేజేష్‌ విగతజీవిగా ఉరితాడుకు వేలాడుతుండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కాగా, పబ్జీని కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు యువత ఇతర మార్గాల్లో పబ్జీ గేమ్‌ను డౌన్లోడ్‌ చేసుకుని ఆడుతుండటం గమనార్హం.  

మరిన్ని వార్తలు