పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..

14 Feb, 2022 08:58 IST|Sakshi
స్రవంతి (ఫైల్‌)  

సాక్షి, కణేకల్లు (అనంతపురం): కాలేజీకని వెళ్లి కనిపించకుండాపోయిన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఆత్మహత్యతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ కథనం మేరకు... గెనిగెర గ్రామానికి చెందిన స్రవంతి (17) కణేకల్లు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. తన స్నేహితుడు ఇటీవల పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి స్రవంతి పూర్తి డిప్రెషన్‌లో ఉంది. స్నేహితుడు లేని జీవితం శూన్యంగా అనిపించింది.

శుక్రవారం కాలేజీకని సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై కణేకల్లు–బళ్లారి రోడ్డు వద్దనున్న బస్టాప్‌ వరకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పుస్తకాలు బస్టాప్‌ వద్దనున్న ఆలయం ముందు కనిపించడంతో ఆమె కోసం గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు. స్రవంతి శుక్రవారం రోజే హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం యర్రగుంట వద్ద మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు తమ కూతురేనని గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి)

మరిన్ని వార్తలు