ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ కిలి పాల్‌పై హత్యాయత్నం.. కత్తులు, కర్రలతో దాడి, ఆస్పత్రిలో..

2 May, 2022 07:48 IST|Sakshi

Kili Paul Attacked: ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, యాక్టివ్‌గా స్టెప్పులేసే అతను.. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్‌ మీద దీనస్థితిలో ఉన్నాడు. చేతి బొటనవేలుకి రక్తపు మరకతో బ్యాండేజ్‌. కాళ్ల మీద గాయపు గుర్తులు.. ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌గా పేరొందిన కిలి పాల్‌ పరిస్థితి ఇది. కత్తులతో, కర్రలతో ఆయన మీద ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ని, సోషల్‌ మీడియాలో ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌ ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్‌. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌, ప్రముఖుల దాకా ఈ టాంజానియా ఇంటర్నెట్‌ సెలబ్రిటీకి ఫ్యాన్స్‌. అతని ఇన్‌స్టా రీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్‌, నీమాపాల్‌లు. 

అయితే కిలి పాల్‌ మీద ఎవరో దుండగులు దాడి చేశారు. ‘కొందరు తనను కింద పడేయాలని చూస్తున్నారు. కానీ, దేవుడు మాత్రం తనకి సాయం చేస్తూ వస్తున్నాడు. నా కోసం ప్రార్థించండి’ అంటూ ఓ స్టోరీ పోస్ట్‌ చేశాడు కిలి పాల్‌. అయితే అతని మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌లో వీడియోల ద్వారా పాపులర్‌ అయిన కిలి పాల్‌.. ఎక్కువ భారతీయ సినీ గేయాలు, డైలాగులకే డ్యాన్సులు చేస్తుంటాడు. తక్కువ టైంలో గుర్తింపు దక్కిన అతనికి ఫిబ్రవరిలో భారత హై కమిషన్‌ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. అంతెందుకు ప్రధాని మోదీ సైతం తన మన్‌ కీ బాత్‌లో కిలి పాల్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా.

మరిన్ని వార్తలు