పరువు హత్య​: దర్శకుడిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు

22 May, 2021 18:46 IST|Sakshi

ఇరాన్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడి పరువు హత్య

వెబ్‌డెస్క్‌: ఇరాన్‌కు చెందిన దర్శకుడు బాబక్‌ ఖోర్రామ్డిన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖోర్రామ్డిన్‌ను అతడి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. నిందితులు కేవలం ఖోర్రామ్డిన్‌ని మాత్రమే కాక వారి కుమార్తె, అల్లుడిని కూడా ఏళ్ల క్రితమే ఇంతే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బిడ్డలను చంపినందుకు తాము ఏ మాత్రం బాధపడటం లేదనడం గమనార్హం.

ఆ వివరాలు.. ఖోర్రామ్డిన్‌ దారుణ హత్య ఇరాన్‌లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో దర్శకుడి హత్య వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా రెండు తెగిపడిన చేతులు కనిపించాయి. ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా అవి దర్శకుడు ఖోర్రామ్డిన్‌విగా గర్తించారు.  ఇక దర్శకుడి హత్య గురించి తెలిసిన నాటి నుంచి అందరూ అతడి తల్లిదండ్రుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో పోలీసులు ఖోర్రామ్డిన్‌ తల్లిదండ్రులు ఇరాన్ ఖోర్రామ్దిన్( 74), అక్బర్ ఖోర్రామ్దిన్‌(81)లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వారు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కొడుకుని తామే హత్య చేశామని తెలిపారు. చైర్‌కు కట్టేసి.. తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. ఊపిరాడకుండ చేసి చంపేశామని.. ఆ తర్వాత అతడిని ముక్కలుముక్కలుగా నరికి రెండు సూట్‌కేసులలో పెట్టి.. డస్ట్‌బిన్‌లో పడేశామని వెల్లడించారు. 

తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. 
ఖోర్రామ్డిన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం రాత్రి నా భార్య చికెన్‌ వండింది. దానిలో విషం కలిపాము. కానీ నా కుమారుడు భోజనం చేయలేదు. తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దాంతో చికెన్‌ ఫ్రిజ్‌లో పెట్టాం. మరుసటి రోజు తింటాడని భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో మరుసటి రోజు నా కుమారుడు బయటకు వెళ్లి వచ్చే వరకు ఆగాం. సాయంత్ర ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చిన నా కుమారుడిని చైర్‌కు కట్టేసి.. తన తలకు ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి ఊపిరాడకుండా చేశాం. ఆ తర్వాత కత్తితో తనని పొడిచి చంపేశాం. ఆ తర్వాత తనను ముక్కలుగా నరికి రెండు సూట్‌కేస్‌లలో శరీర భాగాలను సర్ది.. బయట పడేశాం’’ అని తెలిపారు.

విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడు.. 
తమ కుమారుడు తన కోచింగ్‌ సెంటర్‌లోని విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడని.. దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతోనే అతడిని హత్య చేశామని తెలిపారు. అంతేకాక కొన్నేళ్ల క్రితం తమ కుమార్తె, ఆమె భర్తను కూడా ఇలానే హత్య చేశామని వెల్లడించారు. కుమార్తె డ్రగ్స్‌కు అలవాటు పడిందని.. అల్లుడు తమను తిడుతూ.. శాపనార్థాలు పెట్టేవాడని.. అందుకే వారిద్దరిని అంతం చేశానని వెల్లడించారు. ఇక మేం చేసిన పనికి మాకేం బాధ కలగడం లేదు. నా బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తున్నారు. వారి వల్ల మా పరువు పోతుంది. అందుకే నా భార్య సాయంతో వాళ్లని చంపేశాం అన్నాడు. ఈ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. 

మరణించిన ఖోర్రామ్డిన్‌ ‘క్రెవిస్’, ‘ఓత్ టు యషర్’ వంటి లఘు చిత్రాలతో సహా పలు ప్రాజెక్టులు తెరకెక్కించాడు. అతను 2009 లో టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సినిమా విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థులకు బోధించడానికి 2010లో ఇరాన్‌కు మారాడు.

చదవండి: ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య

మరిన్ని వార్తలు