హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్‌

2 Apr, 2022 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో మరోసారి  ఐసిస్‌ కలకలం రేపుతోంది. ఐసిస్‌ తీవ్రవాదంపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్‌ ద్వారా మీర్‌చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్‌ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్‌లో కొంతకాలంగా నివాసముంటున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు.

కాగా 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్‌ తరువాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సులేమాన్‌ తరువాత ఫండింగ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచార‌ణలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సులేమాన్ ఏకంగా 20 ఖాతాల‌ను తెరిచి యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లేలా చేస్తున్నాడ‌ని పోలీసులు తేల్చారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్‌ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్‌ దిగే లోపు పోలీసుల ఎంట్రీ

మరిన్ని వార్తలు