ప్రముఖ నటుడి సినిమా.. టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం తండ్రి డబ్బివ్వలేదని..

16 Feb, 2022 03:01 IST|Sakshi
మృతి చెందిన నవదీప్‌

తండ్రి రూ.300 ఇవ్వలేదని బాలుని ఆత్మహత్య

జగిత్యాలక్రైం: సినిమా టికెట్‌ కొనడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల పురాణిపేటలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు నవదీప్‌ (11) ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

త్వరలో విడుదల కానున్న ఒక ప్రముఖ నటుని సినిమా కోసం తన స్నేహితులు టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. టికెట్‌ కొనడానికి రూ.300 కావాలని తండ్రిని నవదీప్‌ సోమవారం రాత్రి అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని తండ్రి బదులివ్వడంతో మనస్తాపానికి గురైన నవదీప్‌.. ఇంటి ఎదుట గల బాల్కనీలో లుంగీతో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుని తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ కిశోర్‌ తెలిపారు.
(చదవండి: GHMC: హైదరాబాద్‌ సిటీలో సాఫీ జర్నీకి సై)

మరిన్ని వార్తలు