జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

13 Nov, 2020 08:58 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌:  జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు గంజి రాంబాబు (49), లావణ్య (47) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరోనా ప్రభావం, ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ముంబాయిలో ఓ యాడ్ ఏజెన్సీలో పని చేసే దంపతులు రాంబాబు తండ్రి రాజేశం పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా స్వస్థలం జగిత్యాలకు వచ్చారు. 

కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. మరోవైపు కరోనా ప్రభావంతో ఉన్న ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఉన్న ఇంటిని సైతం రాంబాబు..తన సోదరులు విక్రయించే ప్రయత్నం చేయగా గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెంది వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం నుంచి దంపతులిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మున్సిపల్‌ సిబ్బంది సాయంతో తలుపులు తొలగించి చూడగా... ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. సంతానలేమి కరోనా ప్రభావం ఆర్థిక ఇబ్బందులే దంపతులు ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు