ఈవెంట్‌కి వెళ్లకుండా అడ్డుకుందని..సుత్తితో కొట్టి..పది ముక్కలుగా కోసేశాడు

18 Dec, 2022 12:02 IST|Sakshi

సాక్షి, జైపూర్‌: యావత్తు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం మరువక మునుపే అచ్చం అలాంటి తీరులోనే మరో ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఈవెంట్‌కి వెళ్లొద్దని అడ్డు చెప్పిందన్న కోపంతో అత్తను సుత్తితో కొట్టి చంపి ముక్కలుగా చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...32 ఏళ్ల అనూజ్‌ శర్మ అనే యువకుడు జైపూర్‌లోని విద్యానగర్‌లో తండ్రి, చెల్లి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఆ యువకుడి తల్లి గతేడాది కరోనా సమయంలో మృతి చెందింది. అతడి చెల్లి, తండ్రి ఇండోర్‌లో వెళ్లడంతో ఈ నెల డిసెంబర్‌ 11 నుంచి అనుజ్‌ అతడి మేనత్త సరోజ్‌ ఇద్దరే జైపూర్‌లో ఉంటున్నారు. వాస్తవానికి అనూజ్‌ మేనత్త సరోజ్‌ భర్త చనిపోవడంతో ఆమె అతడి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఐతే ఒకరోజు అనూజ్‌ ఢిల్లీలోని ఒక ఈవెంట్‌కి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయమై అతడి మేనత్తకు ఆమెకు మధ్య వాగ్వాదం తలెత్తింది.

దీంతో అనూజ్‌ కోపంతో ఒక సుత్తి తీసుకుని మేనత్తను కొట్టి చంపేశాడు. ఆతర్వాత ఆమె మృతదేహాన్ని ఒక మార్బుల్‌ కట్టర్‌తో సుమారు 10 ముక్కలుగా కోసేశాడు. ఆ భాగాలను బకెట్‌, సూట్‌కేసులలో పెట్టుకుని జైపూర్‌-సికర్‌ హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి అత్త కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు పెట్టాడు. అతడు కేసును తప్పుదోవ పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడు.

ఐతే అతడి చర్యలను అనుమానించిన పోలీసులు నిందితుడి ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..అతడు మాత్రమే ఇంటి నుంచి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. పైగా అతడి ఫ్లాట్‌లోని కిచెన్‌లో రక్తపు మరకలను గుర్తించారు పోలీసలు. సదరు యువకుడు బీటెక్‌ వరకు చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీసీటీవీలో బకెట్లు, సూట్‌కేసులతో అనూజ్‌ బయటకు వెళ్లినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. 

(చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...)

మరిన్ని వార్తలు