తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోమంటే ప్రాణాలు తీశారు!

18 Oct, 2020 08:57 IST|Sakshi

అత్యాచారం.. ఆపై భయంతో హత్య

జల్గావ్‌ ఘటనపై ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు

13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానం

విషయం బయట పడుతుందేమోనన్న భయంతో చిన్నారుల హత్య

నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, ముంబై: జల్గావ్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గావ్‌ జిల్లా రావేర్‌ పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న భోర్‌ఖేడా గ్రామ సమీపంలోని ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్, రుమాలీబాయి బిలాల్‌ అనే దంపతుల తమ ఐదుగురి పిల్లలతో అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బిలాల్‌ దంపతుల బంధువులు దశదిన కర‍్మలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు పెద్ద కుమారుడితో పాటు వెళ్లారు.

మిగతా పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. మూడేళ్ల వయసున్న చిన్న కుమార్తె, మరో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 13 ఏళ్ల వయసున్న ఇంకో కుమార్తెను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు ఒక్కరే ఉంటారని, గ్రామానికి ఇల్లు దూరంగా ఉండటంతో వారిని చూసుకోవాలని బిలాల్‌ పెద్ద కుమారుడు అతని మిత్రులకు చెప్పాడు. ఇదే అదనుగా చూసుకున్న నిందితులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం తాగి వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు.
(చదవండి: మిథున్‌‌ చక్రవర్తి కుమారుడిపై అత్యాచారం కేసు)

విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికతో పాటు మిగతా వారిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో నిందితులు ముఖేశ్‌ సన్యాల్‌, రాజు అలియాస్‌ గుడ్డు, సునీల్‌ సీతారాంలతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన నిందితుల దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

బాలికపై సాముహిక అత్యచారం?
ఈ ఘటనలో నిందితులు మైనర్‌ బాలికపై సామూహిక అత్యచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టంలో మైనర్‌ బాలికపై అత్యచారం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే పూర్తి రిపోర్టు వస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 

రూ.రెండు లక్షల సాయం... - గులాబ్‌రావ్‌ పాటిల్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
బాధిత కుటుంబ సభ్యులతో జల్గావ్‌ ఇంచార్జ్‌ గులాబ్‌ రావ్‌ పాటిల్‌ భేటీ అయ్యారు. బిలాల్‌ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అదవిధంగా ఈ కేసు దర్యాప్తు సరైన దిశలో కొనసాగుతుందని తెలిపారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు