ఇంటికి వెళ్లిన కార్యకర్తపై దూషణల పర్వం
ఆవేశంతో కారు అద్దాలు పగులగొట్టిన కార్యకర్త
వైఎస్సార్ సీపీపై అభియోగం మోపేందుకు కుటిలయత్నం
సాక్షి, చిత్తూరు (రేణిగుంట): జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నగరం వినుత భర్త కోట చంద్రబాబు తనను కులం పేరుతో దూషించి, ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆ పార్టీ కార్యకర్త శివ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం... రేణిగుంట సమీపంలోని మర్రిగుంటకు చెందిన శివ జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఎల్ల మండ్యం సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ నుంచి అవకాశం కల్పిస్తానని వినుత భర్త హామీ ఇచ్చాడు. అయితే కొన్ని సమస్యలపై శుక్రవారం ఉదయం రేణిగుంటలోని నగరం వినుత ఇంటికి శివ వెళ్లాడు. తనపై పోలీస్ స్టేషన్లో కేసు ఉందని, వారితో మాట్లాడాలని కోట చంద్రబాబును ప్రాధేయపడ్డాడు. (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)
అయితే కులం పేరిట అతను దూషించి గెంటేయడంతో ఆగ్రహించిన శివ అక్కడున్న వారి కారు అద్దాలను పగలగొట్టాడు. కులం పేరిట తనను దూషించారని చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, కారు అద్దాలు ధ్వంసం చేశాడని శివపై నగరం వినుత ఫిర్యాదు చేశారు. కాగా, రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపై వారు విమర్శలు చేయడం సరికాదని శివ ఖండించాడు. ఇక, రేణిగుంట పోలీసులు ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ప్రచారానికే పరిమితమైన జనసేన)