రూ.10 కోట్ల భూకుంభకోణం.. జనసేన నాయకుడి అరెస్ట్‌

10 Aug, 2021 17:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా ఏడుగురు అరెస్ట్‌

గుంటూరు: పెదకాకాని మండలం అగంతవరప్పాడులో 10 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం కేసులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టివాసు సహా ఏడుగురిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు నిందితులు ప్లాన్‌ చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా మరో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం మంగళవారం వారిని అరెస్ట్‌ చేశారు. 

అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. 2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్‌ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్‌ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలడంతో వారిని అరెస్ట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు