మ్యాజిక్‌ ఇసుక : మండిస్తే.. బంగారమా?!

23 Jan, 2021 13:47 IST|Sakshi

జుయల్లర్‌కే కుచ్చు టోపీ

4 కిలోల మ్యాజిక్‌ ఇసుక​తో రూ. 50 లక్షలు మోసం

సాక్షి, ముంబై: నమ్మిన వాడినే నట్టేట ముంచిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మ్యాజిక్‌ సాండ్‌ పేరుతో ఏకంగా బంగారు వ్యాపారికే టోకరా ఇచ్చాడో ఘరానా మోసగాడు. తాను తీసుకొచ్చిన మహిమ గల ఇసుకను మండిస్తే మేలిమి బంగారం పుట్టుకొస్తుందని వ్యాపారిని నమ్మించాడు. అలా నాలుగు కిలోల ఇసుకను విక్రయించి 50 లక్షల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు..ఈ  విచిత్రమైన సంఘటన పుణేలో నమోదైంది.

వివరాల్లో వెళితే..బంగారు ఉంగరం కొనడానికి షాపునకు వచ్చిన నిందితుడు  పూణేకు  ఆభరణాల వ్యాపారితో గత ఏడాది కాలంనుండి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర వస్తువులను విక్రయిస్తూ మంచివాడిగా నటించి నమ్మకాన్ని పొందాడు.  ఆ తరువాత తనప్లాన్‌ను అమలు చేశాడు. తన దగ్గర ఉన్న ప్రత్యేక ఇసుకను మండిస్తే.. బంగారం తయారవుతుందంటూ వ్యాపారిని  బురిడీ కొట్టించాడు. స్వయంగా ఆభరణాల వ్యాపారి అయి ఉండి కూడా, అమాయకంగా అతని మాయలో పడిపోయిన వ్యాపారి ఆ మాయా ఇసుకను తీసుకొని రూ .30 లక్షల నగదు, సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ముట్టజెప్పాడు. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  

మరిన్ని వార్తలు