మృతురాలి మెడలోంచి బంగారు పుస్తెలతాడు మాయం

4 May, 2021 08:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాలక్రైం: మృతురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయమైనట్లు కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన సద్దినేని సాయమ్మ కుటుంబ సభ్యులంతా జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం సాయమ్మకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ఆమె మృతి చెందింది.

మృతదేహాన్ని ఆస్పత్రి వారు అప్పగిస్తున్న సమయంలో మృతురాలి బంగారు కమ్మలు మాత్రమే అప్పగించారు. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వారిని నిలదీయగా తమ వద్దకు రోగి వస్తున్నప్పుడు మెడలో పుస్తెలతాడు లేదని బుకాయించారు. రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు