ఎన్‌కౌంటర్‌లో చైన్‌ స్నాచర్‌ హతం

12 Oct, 2021 08:23 IST|Sakshi

శ్రీ పెరంబదూరు సమీపంలో ఘటన 

సాక్షి, చెన్నై: కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఓ చైన్‌ స్నాచర్‌ హతమయ్యాడు. మరో స్నాచర్‌ను అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా పెన్నలూరుకు చెందిన ఇందిర అనే వృద్ధురాలి వద్ద ఆదివారం ఇద్దరు యువకులు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. టోల్‌గేట్‌ వద్ద వారిని అడ్డుకునేందుకు అక్కడి దుకాణదారులు ప్రయత్నించగా, ఆ యువకులు తుపాకీతో బెదిరించి తప్పించుకున్నారు. శ్రీ పెరంబదూరు పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు.  

ఎదురుకాల్పుల్లో హతం 
సోమవారం నిందితులు మేవలూరు కుప్పం  వైపుగా వెళ్తున్నారనే సమాచారంతో పెరంబదూరు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ రాజ్‌తో పాటుగా మరికొందరు ఛేజ్‌æ చేశారు. ఈ సమయంలో ఆ స్నాచర్లలో ఒకడు పోలీసులకు చిక్కాడు. దీంతో ఆగ్రహించిన మరొకడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మోహన్‌రాజ్‌ గాయపడ్డారు. అనంతరం తేరుకుని ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే నేలకొరిగాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఉన్న నిందితుడి తుపాకీతో పాటుగా మరో రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని శ్రీ పెరంబదూరు ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్‌ విచారణ జరుగుతోంది. 

జార్కండ్‌ వాసులుగా గుర్తింపు 
విచారణలో నిందితులిద్దరూ జార్కండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన యువ కుడి పేరు ముర్తుజాగా, పట్టుబడ్డ యువకుడు నయూ మ్‌ అక్తర్‌గా తేలింది. మరికొందరు చైన్‌ స్నాచర్లు కార్మికుల రూపంలో ఉండే అవకాశం ఉండడంతో పోలీసులు ఉత్తరాది వారిపై గురి పెట్టారు.

మరిన్ని వార్తలు