ప్రియుడిని నమ్మి అద్దె గర్భానికి ఒప్పుకుంది.. చివర్లో కథ అడ్డం తిరిగింది

18 Oct, 2021 18:48 IST|Sakshi

ముంబై: ప్రియుడి మాట విని సరోగసికి ఒప్పుకుంది ఓ యువతి. అయితే అనుకోకుండా కథ అడ్డం తిరగడంతో చిక్కుల్లో పడింది. చివరకు పోలీసుల రంగప్రవేశంతో ఆ యువతి ఉచ్చులోంచి క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఉద్యోగ అన్వేషణ నిమిత్తం ముంబైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు నేవీ ముంబైలో ఓ డయోగ్నస్టిక్‌ సెంటర్‌లో చేరింది. కొన్ని రోజుల తరువాత అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

అయితే అనుకోకుండా వారు పని చేస్తున్న డయోగ్నస్టిక్‌ సెంటర్‌ మూసివేయడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ప్రియుడు సరోగసికి ఆమెను ప్రోత్సహించాడు. అలా చేస్తే రూ. 4-5 లక్షల డబ్బు వస్తుందని నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆమెను హైదరాబాద్‌కు పంపాడు. ఈ క్రమంలో వారు టోకన్‌ అడ్వాన్స్‌ కింద కొంత సోమ్మును కూడా తీసుకున్నారు. ఆగస్టు నెలలో ఆ యువతికి సరోగసి పరీక్షలు చేసిన వైద్యులు అందుకు ఆమె పనికి రాదని తెలిపారు.

దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. వారి దగ్గర తీసుకున్న టోకన్‌ డబ్బు కట్టలేకపోయింది. ఆమె ద్వారా డబ్బు పరంగా తనకెటువంటి లాభం లేదని గ్రహించిన ప్రియుడు అక్కడినుంచి జంప్‌ అయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆ యువతి సెప్టెంబర్‌ 28న తన తల్లికి ఫోన్‌ చేసింది. తల్లి సదరు యువతిని పోలీసుల దగ్గరకు వెళ్లమని చెప్పింది. అనంతరం యువతి తల్లి తన కూతురు కనిపించటం లేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హైదరబాద్‌లో ఉన్న యువతి ముంబైకి తీసుకువచ్చారు. విచారణలో ఆమె జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ప్రియుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: వివాహేతర సంబంధం: మందలించిన భర్త.. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌ వేసిన భార్య..

మరిన్ని వార్తలు