యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య

1 Dec, 2020 11:04 IST|Sakshi

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

లక్నో(ఉత్తరప్రదేశ్‌) : జర్నలిస్టు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను బలరామ్‌పూర్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 37 ఏళ్ల జర్నలిస్టు రాకేష్‌సింగ్‌ నిర్భిక్‌, మరో జర్నలిస్టు పింటు సాహు (34)తో కలిసి గ్రామసర్పంచ్‌ చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే కాల్వారి గ్రామ సర్పంచ్ కుమారుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అధిక ఆల్కహాల్‌ శాతం కలిగిన శానిటైజర్‌ను జర్నలిస్టులపై పారబోసి ఆ తర్వాత నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘనటలో సాహు అక్కడికక్కడే మరణించగా, మరో జర్నలిస్టు రాకేష్‌ సింగ్‌ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. శరీరం అప్పటికే 80 శాతానికి పైగా కాలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. సర్పంచి చేస్తోన్న అవినీతిపై వరుస కథనాలు ప్రచురించడం, సాహుతో డబ్బు చెల్లింపులు లాంటి వివాదాలు ఉండటంతో ఇద్దరినీ చంపేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది.  (కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు)

ఈ కేసులో సర్పంచ్ కుమారుడు రికు మిశ్రాకు, ఇదివరకే పలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న స్నేహితుడు అక్రమ్, లలిత్‌ మిశ్రా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జర్నలిస్ట్‌ రాకేష్‌ సింగ్‌ చనిపోవడానికి ముందే తనపై హత్యాయత్నం చేసింది సర్పంచి కుమారుడేనని పేర్కొంటూ రెండున్నర నిమిషాల వ్యవధి గల వీడియోను రూపొందించాడు. అక్రమాలపై వరుస కథనాలు రాస్తూ నిజాయితీ గల జర్నలిస్టుగా ఉ‍న్నందుకు ఇదే నాకు లభించిన బహుమతి అంటూ వీడియోలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 17 మందిని విచారించారు. ఇరువురి మధ్య ఉన్న పాత తగాధాల కారణంగా పథకం ప్రకారం జర్నలిస్టులను హత్య చేయించినట్లు బలరామ్‌పూర్‌ పోలీసు చీఫ్ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని కూడా విచారిస్తున్నామని, అవసరమైతే వారిని సైతం అరెస్టు చేస్తామని వెల్లడించారు. (కూతురి నుంచి ప్రాణహాని.. సంచలన ఆరోపణలు)

మరిన్ని వార్తలు