జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసు: పబ్‌లోకి వచ్చే ముందే కారులో కండోమ్‌ ప్యాకెట్లు

13 Jun, 2022 09:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు పబ్‌లోకి ఎంటర్‌ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్‌ కారులో పోలీసులు కండోమ్‌ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్‌ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు  పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్‌ ఇంటెన్షన్‌తోనే పబ్‌కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. 

కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. అత్యాచార కేసులో మైనర్‌లతోపాటు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్‌ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. 

ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్‌ నంబర్‌ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్‌ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్‌ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు.
సంబంధిత వార్త: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

అయితే సోమవారం మరోసారి అయిదుగురు మైనర్‌లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు  తరలించనున్నారు. సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు.

మరిన్ని వార్తలు