రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ ఆదేశం

9 Jun, 2022 13:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తక్షణం వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసు ఘటనలో  వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ కుమారుడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వక్ఫ్‌బోర్డు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంపై పార్టీ సీరియస్‌ అయ్యింది. చర్యలు తీసుకునే బాధ్యతను హోంమంత్రి మహమూద్‌ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారు.
చదవండి: జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు

కాగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దినాజ్‌ జహాన్‌ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.

మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్‌ జహాన్‌తో పాటు వక్ఫ్‌ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్‌ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్‌ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు