అప్పికొండ తీరంలో కాకినాడ బాలిక గల్లంతు

19 Oct, 2021 08:11 IST|Sakshi
గల్లంతైన దీపిక(ఫైల్‌)  

దసరాకు వచ్చి తిరుగు వెళ్తుండగా ఘటన 

సాక్షి, పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు పరిధి అప్పికొండ సముద్ర తీరంలో ఓ బాలిక సోమవారం గల్లంతైంది. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలం జగన్నాథపురానికి చెందిన ఓబులూరి ప్రదీప్, సత్య దంపతులు తమ ఇద్దరి కుమార్తెలతో పాటు బంధువులతో కలిసి దసరా పండగకని గంగవరం గ్రామంలోని అత్తారింటికి వచ్చారు. వారంతా సోమవారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

దువ్వాడ రైల్వేస్టేషన్‌లో రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉండడంతో పెద్దలు, పిల్లలతో సహా మొత్తం 12 మంది అప్పికొండ తీరానికి వెళ్లారు. అక్కడ సముద్రంలో సరదాగా గడుపుతుండగా.. ఓబులూరి దీపిక(15)తో పాటు స్నేహితురాలు హరిణి ఒక్కసారిగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోయారు. గమనించిన దీపిక తండ్రి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. హరిణిని ఒడ్డుకు తీసుకువచ్చారు. దీపిక మాత్రం అలల తాకిడికి కొట్టుకుపోయింది. వారు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీపిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రదీప్‌ ఫిర్యాదు మేరకు దువ్వాడ సీఐ లక్ష్మి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.    

చదవండి: (అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు)

మరిన్ని వార్తలు