తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు.. పోలీసులకు దొరక్కుండా బోరుబావిలో..

13 Dec, 2022 15:27 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక బాగల్‌కోట్‌లో శ్రద్ద వాకర్ హత్య తరహా ఘటన వెలుగుచూసింది. సొంత కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని విఠల కులాలి(20)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53).

అయితే పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు విఠల.

ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు.
చదవండి: మిస్డ్ కాల్స్‌ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

మరిన్ని వార్తలు