Corona: కొడుకు మృతి.. ఎస్సై భావోద్వేగం

11 May, 2021 11:49 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: కరోనా రక్కసి అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌ కుటుంబం మొత్తం కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కుమారుడు బాబు (20) ఆదివారం కన్నుమూశాడు. తాను, కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని స్వయంగా ఎస్సై వెంకటేశ్‌ ఒక సెల్ఫీ వీడియోలో తెలిపారు. చిన్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు తన కుటుంబం తీవ్ర వేదన అనుభవిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. దయచేసి ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, లాక్‌డౌన్‌లో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. 

ఖాకీ మానవత్వం 
తుమకూరు: పోలీసులంటే కఠినంగా ఉంటారని, లంచాలు తీసుకోనిదే ఏ పనీ చేయరని అంటారు. కానీ శిర పట్టణంలో పనిచేసే మల్లికార్జున్‌ సొంతఖర్చుతో అనాథ అంత్యక్రియలు జరిపించాడు. వారం రోజుల క్రితం బుక్కాపట్టణ పశు ఆస్పత్రి వద్ద ఓ యాచకుడు మరణించగా శవాన్ని మార్చురీలో ఉంచారు. ఈ విషయం తెలిసి మల్లికార్జున్‌ ఆదివారం సొంత ఖర్చుతో అంత్యక్రియలు జరిపించాడు. గతంలోనూ ఆయన పలు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు తెలిసింది.   

చదవండి: Lockdown: 2 వారాలు ఇల్లే భద్రం.. సహకరించండి ప్లీజ్‌!

మరిన్ని వార్తలు