మరో మహిళతో సాన్నిహిత్యం; భార్య మెడకు చార్జర్‌ వైర్‌ బిగించి

31 Jul, 2021 18:27 IST|Sakshi

కర్కోటక భర్త 

బనశంకరి/కర్ణాటక: మూడుముళ్లు వేసి కడదాక తోడుంటానని బాసలు చేసిన భర్త కర్కోటకుడిగా మారాడు. భార్య గొంతుకు చార్జర్‌ వైర్‌ బిగించి హత్య చేశాడు. ఈఘటన కుష్టగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ...యలబుర్గి తాలూకా యడ్డోణి గ్రామానికి చెందిన మంజులకు కొప్పళ తాలూకా ముద్దాబళ్లికి చెందిన మంజునాథ్‌ కట్టమనితో వివాహమైంది. మంజునాథకట్టిమని కుష్టగిలోని కెనరా బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. మంజుల (25) స్థానిక తాలూకా ప్రభుత్వ ఆసుపత్రిలో  ల్యాబ్‌ టెక్నీషియన్‌గా   పనిచేస్తోంది.  

మంజునాథ్‌ మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి.  గురువారం దంపతులు బృందావన హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైర్‌ను మంజుల గొంతుకు బిగించి హత్య చేసి మృతదేహాన్ని కొప్పళ రోడ్డు కదళినగర వద్ద సజ్జ పొలంలో  పడేసి ఉడాయించాడు. శుక్రవారం మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి హతురాలిని మంజులగా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు