Karnataka: విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. ఏమీ తెలియనట్లు నటన.. చివరికి!

13 Oct, 2022 19:01 IST|Sakshi
నిందితుడు కాంతరాజు

సాక్షి, బెంగళూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని ఒక కామాంధుడు హత్యాచారం చేశాడు. మండ్య జిల్లా మళవళ్లి పట్టణంలో ఈ దారుణం జరిగింది. కాంతరాజు (52) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాలు.. మంగళవారం ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్యూషన్‌ చుట్టుపక్కల  గాలించినా ఆచూకీ దొరకలేదు. సమీపంలో ఒక బేకరీ వద్ద నాగరాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలోని ఇంటి సంపులో బాలిక మృతదేహం ఉన్నట్లు తెలిసి అక్కడకు పరుగులు తీశారు. అది తమ కూతురిదేనని తెలిసి విలపించారు.  

ఏమీ తెలియనట్లు నటన 
ట్యూషన్‌లో పనిచేసే కాంతరాజు అనే వ్యక్తి పోలీసులతో పాటు తిరుగుతూ బాలిక ఆచూకీ కోసం వెతుకులాడినట్లు నటించాడు. బాలిక తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ట్యూషన్‌ వద్ద ఎవరో ముగ్గురు యువకులు ఉంటారని, వారిపై అనుమానం ఉందని చెప్పాడు. 

కాల్‌ రికార్డుతో దొరికిన కాంతరాజు  
కాంతరాజు చెప్పిన విషయాలు అబద్ధమని పోలీసులకు తెలిసింది. దీంతో అతనిపై అనుమానంతో ప్రశ్నించగా తనకేమి తెలియదని నమ్మబలికాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా బాధిత బాలికతో మాట్లాడిన కాల్‌ రికార్డు దొరికింది. స్కూల్‌ సెలవు కావడంతో ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు రావాలని అతడు బాలికకు చెప్పాడు. తరువాత బాలికను నిర్మాణంలోని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో చంపి సంపులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. 

మరిన్ని వార్తలు