Karnataka: సంచలనం సృష్టించిన పోక్సో కేసు.. మురుఘ మఠాధిపతి అరెస్ట్‌

2 Sep, 2022 08:46 IST|Sakshi

సాక్షి,బెంగళూరు: రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైస్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మురుగ మఠానికి చెందిన శివమూర్తి మురుగ శరణారావుకు.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే మురుగ మఠాధదిపతి శివమూర్తికి ఛాతీలో నొప్పి రావడంతో భారీ బందోబస్తు మధ్య చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అనంతపురం జిల్లా జైలుకు తరలించనున్నట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ పరశురాం తెలిపారు. కాగా  గురువారం రాత్రి మురుఘ రాజేంద్ర మఠంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షలకు తరలించారు. గత నెల 26న చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్‌ విద్యార్థినులు స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాద్‌ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

వారంరోజుల ఉత్కంఠ  
వారం రోజులుగా ఈ విషయం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టులో స్వామీజీ చేసుకున్న దరఖాస్తుపై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు మఠం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చివరకు రాత్రి హైడ్రామా మధ్య స్వామీజీ అరెస్ట్‌ను ప్రకటించారు. ఇదివరకే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం నుంచి స్వామీజీని పోలీసులు విచారించనున్నారు. స్వామీజీకి మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు నేతలు ప్రకటనలు చేశారు. 
చదవండి: కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే..

మరిన్ని వార్తలు