ఇంజనీర్‌తో పెళ్లి.. ఏడాదిన్నరకే అసలు కథ మొదలైంది!

15 Jun, 2022 07:23 IST|Sakshi
కొడుకు అనీశ్‌తో నిఖిత (ఫైల్‌)

భర్త వేధింపులతో దారుణ నిర్ణయం  

బనశంకరి(బెంగళూరు): డబ్బు కోసం భర్త వేధింపులకు తల్లీ, చిన్నారి కొడుకు ప్రాణాలు వదిలారు. దావణగెరె జిల్లా జగళూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. జగళూరు పట్టణానికి చెందిన నిఖిత (25), 9 నెలల కొడుకు అనీశ్‌కు ఉరివేసి చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. నిఖితకు ఏడాదిన్నర కిందట దావణగెరెకి చెందిన ఇంజనీర్‌ మనోజ్‌కుమార్‌తో పెళ్లయింది. మనోజ్‌కుమార్‌ దావణగెరె పాలికెలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో సోమవారం నిఖితా పుట్టింటికి వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కాగా, మంగళవారం ఉదయం పాఠశాలలకు వెళ్లిపోయారు. తరువాత నిఖిత పసికందుకు ఉరివేసి చంపి, తానూ ఉరేసుకుని తనువు చాలించింది.  సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న తరువాత ఘోరం వెలుగులోకి వచ్చింది. అల్లునికి రూ.6 లక్షల కట్నం, బంగారుఆభరణాలు ఇచ్చామని, కానీ అతని ధనదాహం తీరలేదని, కుమార్తెను చిత్రహింసలకు గురిచేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అత్త, అల్లుని వేధింపులతోనే ఈ  ఘోరం జరిగిందని కన్నీరుపెట్టారు. జగళూరు పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

 చదవండి: చిట్టితల్లి ఇక లేదు.. అందుకే..

మరిన్ని వార్తలు