మాస్క్‌ పెట్టుకొమ్మని అడిగినందుకు ఎంత పనిచేశారు..

17 Jul, 2021 16:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్‌ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన, కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్‌ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్‌ను చితకబాదారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్‌ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్‌ గేట్‌ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్‌ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్‌ వారిని మాస్క్‌ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.

అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్‌లోని జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు  చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు