కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!

16 Aug, 2020 11:49 IST|Sakshi

సాక్షి, మేడ్చల్: అవినీతి తిమింగలం కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్టర్‌ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్‌ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు పత్రాలు కూడా అంజిరెడ్డి వద్ద లభ్యమమైనట్టు తెలిసింది. (చదవండి: కదులుతున్న ‘పాముల పుట్ట’)

కేసు వివరాలు..
కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్‌ రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్‌ కలెక్టర్‌ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్‌ ఆర్డర్‌ కాపీ, నోట్‌ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్‌ నాగరాజు రియల్టర్‌ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్‌ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. (అవినీతికి పడగలెత్తిన నాగరాజు)

మరిన్ని వార్తలు