నాగరాజు లాకర్‌లో 1.5 కిలోల బంగారం

2 Sep, 2020 20:11 IST|Sakshi

భారీగా బయటపడుతున్న నాగరాజు అక్రమార్జన

సాక్షి, హైదరాబాద్‌: కీసర తహసీల్దార్‌ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్‌ లాకర్‌ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్‌ పేరిట అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్‌ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు)

మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్‌ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక  నాగరాజు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస సీల్దార్)

మరిన్ని వార్తలు