దారుణం: కన్న తండ్రిని హింసించి చంపిన కొడుకు

22 Jan, 2021 18:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపే తల్లిదండ్రులు ఎందరో! కన్నబిడ్డలను పోషించేందుకు ఒళ్లు హూనం చేసుకునే అ‍మ్మానాన్నలు ఎందరో! పిల్లలు బాగుంటే అదే పదివేలు అని జీవితాంతం కష్టపడే అభాగ్య తల్లిదండ్రులు చివరికి అందరూ ఉన్న అనాథలుగా మారుతున్నారు. మలి వయసులో వారికి అండగా నిలవాల్సిన పిల్లలు రాక్షసులై వేధిస్తున్నారు. బుక్కెడు తిండి పెట్టేందుకు చిటపటలాడుతున్నారు. ఓ చోట కన్నకొడుకే తండ్రికి అన్నం పెట్టకుండా ఆయన కడుపు మాడ్చి చంపిన దారుణ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

తిరువనంతపురం: కేరళలోని ముండాయక్కమ్‌కు చెందిన పొడియాన్‌(80), యామిని(76) వృద్ధ దంపతులు తన కొడుకు రేజీతో కలిసి నివసిస్తున్నారు. తాగుడుకు బానిసైన రేజీ నిత్యం తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో అతడు తన తల్లిదండ్రులను గదిలో బంధించి తిండి పెట్టకుండా హింసించాడు. ఇరుగు పొరుగు కూడా వారికి ఆహారం అందించకుండా ఉండేందుకు ఆ గదిలో కుక్కను కట్టేశాడు. దీంతో ముసలి జంటను దుస్థితి తెలిసి వారికి సాయం చేద్దామన్నా కుక్క ఉండటంతో ఎవరూ వారి దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. (చదవండి: భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య)

పిడికెడు మెతుకులు కూడా కడుపులో పడకపోవడంతో డొక్క లోపలకు పోయి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. వాళ్ల దయనీయ పరిస్థితిని చూసి కొందరు ఆశా కారక్యర్తలకు సమాచారం అందించారు. మంగళవారం నాడు వారు పోలీసులను వెంట పెట్టుకుని రాగా దంపతులను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పొడియాన్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం నివేదికలోనూ అతడికి తిండి లేక అంతర్గత అవయవాలు దెబ్బతిని మరణించాడని తేలింది. మరోవైపు అతడి భార్య ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రేజిని అరెస్టు చేశారు. (చదవండి: మెయిల్‌ ఓపెన్‌ చేస్తే జేమ్స్‌ అధీనంలోకి వెళ్లడమే!)

మరిన్ని వార్తలు