దారుణం: మైనర్ బాలిక‌పై 38 మంది అత్యాచారం

19 Jan, 2021 14:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్‌కౌంటర్‌ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కేరళలో ఓ మైనర్‌ బాలికపై గత కొద్ది నెలలుగా 38 మంది మృగాళ్లు రాక్షస క్రీడ కొనసాగించారు. నిర్భయ కేంద్రంలో కౌన్సెలింగ్‌ సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాలిక 13వ ఏట ఉండగా.. ఈ అత్యాచారాల పర్వం మొదలయ్యింది. అలా ఓ ఏడాది పాటు నరకం అనుభవించిన బాలికను చైల్డ్‌ హోమ్‌కు తరలించారు అధికారులు. కొద్ది రోజుల తర్వాత బాలికను ఆమె తల్లి, అన్నతో ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలిక కనిపించకుండా పోయింది. ఇక ఆమెని వెతగ్గా గతేడాది డిసెంబర్‌లో పాలక్కడ్‌లో ఆచూకీ లభ్యం అయ్యింది. ఆమెని నిర్భయ సెంటర్‌కి తరలించి.. కౌన్సెలింగ్‌ సెషన్‌ నిర్వహించగా.. బాలిక హృదయం ద్రవించే విషయాలు వెల్లడించింది. (చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్‌లో ఉన్నాం: మంత్రి)

దాదాపు 38 మంది మృగాళ్లు ఆమెపై రాక్షస క్రీడ కొనసాగించారని తెలిపింది. బాధితురాలు చెప్పే విషయాలు విని అధికారుల కళ్లు చెమర్చాయి. మరో దారుణం ఏంటంటే.. బాలికపై అత్యాచారం చేసిన వారంతా ఆమెకి తెలిసిన వారే కావడం గమనార్హం. ఇక బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు అధికారులు నిందితులందరి లైంగిక దోపిడితో సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మలప్పురం సీడబ్ల్యూసీ(చైల్డ్‌ వెల్‌ఫేర్‌ కమిటీ) ప్రెసిడెంట్‌ షాజేశ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘బాధితురాలిని ఏడాది క్రితం చైల్డ్‌ హోం నుంచి బయటకు పంపినప్పుడు ఆమె భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఒక్కసారి బాధితులను వారి సంరక్షకులకు అప్పగించిన తర్వాత సమస్యలు తలెత్తుతున్నాయి. సంరక్షులు బాధితులను సరిగా పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు