Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి

29 Jun, 2021 15:58 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మధిర ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారన్న నెపంతో వృద్ధ దంపతులపై స్థానికులు విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. అంతేగాకుండా భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి అమానుషంగా వ్యవహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర కళామందిర్ రోడ్డులో దంపతులు గద్దల మోహన్‌రావు (75), గద్దల సరోజినీ (68) నివాసం ఉంటున్నారు. వీరి మనవడు  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో... పెనుగంచిప్రోలులో ఓ పూజారిని కలవగా ఇంటి వద్ద పూజను నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. 

ఈ క్రమంలో, అదే కాలనీకి చెందిన ఓ కుటుంబం.. మోహన్‌రావు దంపతులు తమకు చేతబడి చేయిస్తున్నారనే అనుమానంతో వారిపై దాడి చేశారు. ఇలా రెండు రోజులుగా వారిపై దాడులు చేస్తుండటంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. కాగా వృద్ధులు అన్న కనికరం లేకుండా మూఢనమ్మకాలతో వీరిపై దాడి చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.

చదవండి: మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ
‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’

మరిన్ని వార్తలు