‘సూది’ మర్డర్‌ వెనుక అసలు కథ ఇదే.. షాకింగ్‌ నిజాలు తెలిపిన పోలీసులు

21 Sep, 2022 21:52 IST|Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం వల్లభి గ్రామ శివారులో జరిగిన సూదిమందు హత్య కేసులో భార్యనే విలన్‌గా తేల్చారు పోలీసులు. హత్యలో ప్రమేయం ఉన్న ఆరుగురిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. ఏ1 గోదా మోహన్‌రావు, ఏ2 బండి వెంకన్న, ఏ3 నర్సింశెట్టి వెంకటేష్, ఏ4 షేక్ ఇమాంబీ, ఏ5 బందెల యశ్వంత్, ఏ6 పోరళ్ల సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్

చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోదా మోహన్‌రావుతో జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడని.. ఈ విషయం జమాల్ సాహెబ్‌కు తెలియడంతో భార్యను మందలించాడన్నారు. దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న జమాల్ బీ.. ప్రియుడు మోహన్‌రావుతో కలిసి పథకం వేసిందని ఏసీపీ చెప్పారు. నామవరంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న బండి వెంకన్నకు తమ వివాహేతర సంబంధం గురించి చెప్పి అతని ద్వారా హత్యకు ఉపయోగించే ఇంజెక్షన్‌లు కావాలని కోరాడని ఏసీపీ తెలిపారు.

దీంతో వెంకన్న తన స్నేహితులైన యశ్వంత్, సాంబశివరావు ద్వారా ఇంజెక్షన్‌లు తెప్పించి వాటిని వెంకటేష్ ద్వారా జమాల్‌కి ఇప్పించాలని పథకం అమలు చేసారని చెప్పారు. జమాల్ తన కూతురు గండ్రాయిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్న సమయంలో వల్లబి శివారులో బైక్ లిఫ్ట్ అడిగిన బండి వెంకన్న అతను ఎక్కించుకున్న అనంతరం అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే దిగి తన స్నేహితుడు వెంకటేష్ తీసుకొచ్చిన బైక్ ఎక్కి పారిపోయాడని తెలిపారు. ఇంజెక్షన్ ప్రభావంతో జమాల్ సృహ కోల్పోయి స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడని ఏసీపీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు,ఆరు సెల్ ఫోన్లు, ఇంజెక్షన్, సిరంజీ, స్టరైల్ వాటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు