ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు

16 Oct, 2020 11:04 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : కామాంధుడి చేతిలో అత్యాచారయత్నానికి గురైన తమ కూతురు 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిన్న(గురువారం) కన్నుమూసిందని, తమ కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని బాధిత బాలిక తండ్రి ఉప్పలయ్య, పిన తండ్రి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. అధికార యంత్రాంగం తమ కూతురిని రక్షించేందుకు ప్రయత్నించారని, కానీ! చివరి శ్వాస వరకు పోరాడి బాలిక మృతి చెందిందన్నారు. ఈ ఘటన తమ కుటుంబానికి తీరని లోటుగా పేర్కొన్నారు. తమ అమ్మాయి పోస్టుమార్టం పూర్తి కాగానే ఖమ్మం జిల్లాలోనే అంతక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ( భార్యపై అనుమానంతో తల నరికి.. )

కాగా, ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన ఉప్పలయ్య తన కూతురును (13) ముస్తఫానగర్‌ పార్శిబంధంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనిమనిషిగా కుదిర్చాడు. గత నెల 18న రాత్రి బాలిక పని ముగించుకుని నిద్రిస్తుండగా, సుబ్బారావు కుమారుడు మారయ్య అత్యాచారానికి యత్నించాడు. విషయం బయట పడుతుందని భావించి.. బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి ఆమె కేకలు వేయడంతో పైన నిద్రిస్తున్న నిందితుడి తండ్రి సుబ్బారావు కిందకు చేరుకుని మంటలను ఆర్పివేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది.

మరిన్ని వార్తలు